Wednesday 23 November 2011

శ్రీలంక - ఫుడ్, షాపింగ్


ఫుడ్


    శ్రీలంకలో దాదాపు బౌద్ధ మతస్తులే కాబట్టి  ఎవరో  కొందరు తప్ప అంతా శాకాహారులే అనుకున్నా కానీ అలా ఏమీ లేదు.   పొద్దున్న టిఫిన్ తోనే నాన్ వెజ్ తినటం మొదలైపోతుంది.    శాకాహారులకి కూడా బాధేమి లేదు.  దోశ, గారెలు, అప్పం, కొబ్బరి పచ్చడి ( లాంటిది ) లంచ్ కి కూడా అన్నం, కూరలు ఉంటాయి.  కాండీ, నువారా ఇలియాలో మంచి ఇండియన్ రెస్టారెంట్లు ఉన్నాయి.  అరవ వాళ్ళ హోటల్స్ లో అయితే రుచులు మారినా మన భోజనమే ఉంటుంది.
  
  కిరి బాత్ అనేది  శ్రీలంకన్ సాంప్రదాయ వంటకం.  అన్నాన్ని కొబ్బరి పాలలో ఉడికిస్తారు.  చాలా బావుంటుంది.   రెస్టారెంట్లలో టిఫిన్ కి సర్వ్ చేస్తారు. 


షాపింగ్

    శ్రీలంకన్ టీ బాగా పొపులర్.   చాలా దేశాలకి ఎక్స్పోర్ట్ అవుతుంది కూడా.   టీ ఫాక్టరీలలోనే ఔట్లెట్స్ ఉంటాయి.  రకరకాల ఫ్లేవర్లలో టీ పౌడర్ దొరుకుతుంది. 

     వాల్ హాన్గింగ్స్ కావాలనుకుంటే మాస్క్ చూడటానికి చాలా బావుంటుంది.   చాలా సైజులు వెరైటీలలో దొరుకుతుంది.  మిగతా ఊళ్ళ గురించి తెలీదు కానీ నువారా ఇలియాలో ఉన్న " గ్రాండిస్ హోటల్ " లో సువనీర్ షాప్ ఉంది.  అక్కడ చాలా వెరైటీ మాస్కులు ఉన్నాయి.  రేట్లు కూడా రీజనబుల్  గా ఉన్నాయి.   


Sri Lankan Mask


    చేతితో వేసిన బాతిక్ పెయింటింగ్స్ కూడా దొరుకుతాయి.  కాకపోతే ఖరీదెక్కువ.   ఫ్రేం కట్టించుకోవచ్చు.  లంకా దహనం  లాంటి రామాయణ ఘట్టాలతో పాటు బుద్ధుడు, సిగిరియ రాక్ మీద ఉన్న ఫ్రెస్కోస్, శ్రీలంక  లైఫ్ ని దిపిక్ట్  చేసే బొమ్మలు ఇలా చాలా రకాలుంటాయి.    కాండీ  పెరహెర ( Kandyan  procession)  పెయింటింగ్ చాలా బావుంటుంది.    కాండీలో ఉన్న  టూత్ రెలిక్ గుడిలో ఉన్న బుద్ధుడి పన్నుని ఏనుగు అంబారీ మీద పెట్టి ఊరేగిన్చటమే కాండీ పెరహెర.


Kandy Perahera

  పై ఫోటోలో ఉన్నది బాతిక్ పెయింటింగ్ కాదు. ఇదే బాతిక్ పెయింటింగ్ అయితే దాదాపు ఎనభై అమెరికన్ డాలర్లు ఉంటుంది.   నువారా ఇలియాలో మేమున్న విండ్సర్ హోటల్ లో లంకా దహనం పెయింటింగ్ చాలా బావుంది.  అదయితే శ్రీలంక ట్రిప్ కి సరిగ్గా సరిపోతుంది కొనాలని చాలా ట్రై చేసాం కానీ దొరకలేదు.  చివరికి ఎయిర్ పోర్ట్ లోకూడా  దొరక్కపోయేసరికి దీన్ని ఇరవై డాలర్లకి కొన్నాం.   

Tuesday 22 November 2011

Sri Lanka - Kandapola



 హోటల్ " ది టీ ఫ్యాక్టరీ "  ( The Tea Factory )

ఈ హోటల్ జీవితాంతం గుర్తుండిపోయే మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. 


Hotel Tea Factory

హోటల్ కి వెళ్ళగానే కూర్చోపెట్టి చందనంతో బొట్టు పెట్టి టీ ఇచ్చి అప్పుడు  బుకింగ్ గురించి ఆరా తీస్తారు. 

ఈ హోటల్ ఒకప్పుడు టీ ఫ్యాక్టరీ.   పేరు హెతర్సెట్ ( Hethersett Tea Factory ).  ఇక్కడ తయారు చేసిన  టీ లండన్ లో మామూలు మార్కెట్ రేట్ కన్నా ముప్పై రెట్లు ఎక్కువకి అమ్ముడు పోయేదిట. 1968 లో ఫ్యాక్టరీ మూతపడింది.   దాదాపు పాతికేళ్ళ పాటు నిరుపయోగంగా పడుంది.   1992 లో దీన్ని హోటల్ గా మార్చారు.   బిల్డింగ్ బయట అప్పుడున్నట్టే ఉంచేసారు.   గుర్తుగా కొన్ని మషీన్లు కూడా ఉంచారు. 






రూమ్ లో  ఫ్లోర్ టు  సీలింగ్ విండోస్ ఉంటాయి.  టీ గార్డెన్స్ మధ్యలో ఉన్నట్టుంటుంది.


View from the hotel room

 హోటల్ రెస్టారంట్ లో డిన్నర్ బఫే చాలా గ్రాండ్ గా ఉంది.  డెసర్టులే ఓ యాభై రకాలుంటాయి.   శుష్టుగా నోటితో కళ్ళతో భోన్చేసాం.
 
     హోటల్ టీ గార్డెన్లలోనే ఉంది కాబట్టి పొద్దున్న గార్డేన్లన్నీ తిరిగాము. 









మధ్యాహ్నం  పన్నెండింటికి చెకౌట్ చేసేసి  వచ్చిన ఆటోలోనే నాను ఓయ బయల్దేరాం.  దారిలో పెడ్రో టీ ఫ్యాక్టరీ దగ్గర ఆగి ఓ పది టీ పాకెట్లు కొన్నాం అందరికీ పంచటానికి.   ఆ అందరి సంగతీ తెలీదు కానీ మా ఇంట్లో మాత్రం ఆ టీ పౌడర్  తలకి పెట్టుకునే హెన్నాలో కలపటానికి  బాగా పనికొస్తోంది.    మళ్ళీ నువార ఇలియాలో ఆగి అమ్బల్స్ లో  భోజనం చేసాం.   పనిలో పని రాత్రికి కూడా వడలు పార్సిల్ చేయించుకున్నాం.   3.15 కి నాను ఓయ నించి కొలంబోకి ఇంటర్ సిటీ ట్రైన్ ఉంది.  కొలంబో చేరేసరికి పది గంటలైంది.   ఎయిర్ పోర్ట్ కి ఆటోలు దొరుకుతాయమో చూసాం.  చివరికి ఎయిర్ పోర్ట్ షటిల్ ఏరియాకి సిటీ బస్సు తీసుకున్నాం.   అక్కడ్నించి ఎయిర్ పోర్ట్ కి ఆటో దొరికింది.  

       ఎయిర్ పోర్ట్ కి వెళ్లేసరికి పన్నెండైంది.   పొద్దున్న ఏడున్నరకి ఫ్లైట్.  నాలుగింటికి చెకిన్ చేసాం.   ఫ్లైట్ కాస్తా లేటు.  తొమ్మిదింటికి బయల్దేరింది.   చెన్నైకి పదింటికి కల్లా వచ్చేసాం.

    

Tuesday 15 November 2011

Sri Lanka - Nuwara Iliya



నువారా ఇలియా



శ్రీలంకకి ఇండియాకి గొప్ప అవినాభావ సంబంధముంది. అదే మన రామాయణం ద్వారా. మిగతా ప్రదేశాల గురించి తెలీదు కానీ నువారా ఇలియాని మాత్రం లిస్టులో మొదటి స్థానంలో పెట్టచ్చు.  రామాయణం క్లైమాక్స్ సీన్లు అంటే అశోక వనంలో సీత, లంకా దహనం  జరిగిన ప్రదేశం ఇదే మరి.     
 
  అక్కడ రావణుడు సీతని బంధించిన ప్రదేశానికి గుర్తుగా సీతాదేవి గుడుందని తెలుసుకున్నప్పుడు గుడి చూడాలన్ని కోరిక తప్ప పెద్ద నమ్మకం ఏమీ కలగ లేదు. అందులో రామాయణం ఎప్పుడో అయిదు వేల ఏళ్ళ క్రితమో పది వేల ఏళ్ళ క్రితమో జరిగింది. అప్పటి జియోగ్రాఫికల్ బౌన్డరీస్ వేరు, అప్పటి ఊళ్ళ పేర్లు వేరు. టూరిస్ట్లని ఎట్రాక్ట్ చేయటానికి ఏదో సోది చెప్తారులే  అనుకున్నాం.  

   ఆ రోజు కొత్త సంవత్సరం కూడా. మొదట గుడితో మొదలు పెడితే బావుటుందనిపించింది. మన దేశంలో ఉంటే పండగయినా పబ్బమైనా గుడికెళ్ళాలని అనిపించదు కానీ వేరే దేశం వెళ్ళినప్పుడు మాత్రం దైవ భక్తి తన్నుకుంటూ వచ్చేస్తుంది. అయినా ఆ రోజు మేము వెళ్ళే ప్లేసులలో గుడే మొదట వస్తుంది.

సీత కోవిల్

    గుడిని అరవంలో కోవిల్ అంటారు.   అక్కడ అరవ వాళ్ళు ఎక్కువ. 

నువార ఇలియా నించి సిటి బస్సు తీసుకున్నాం. బస్ లోంచి  గ్రెగరీ లేక్ చూడచ్చు.  కావాలనుకుంటే సరదాగా బోటింగ్ కూడా చెయ్యచ్చు.    గుడికి వెళ్ళటానికి   పావు గంటో ఇరవై నిమిషాలో పట్టింది. 


Sita kovil





ఇదే సీతని బంధించి ఉంచిన  అశోక వనం.   గుడి వెనకాల కనిపించే చెట్లన్నీ అశోక వృక్షాలే.    పచ్చ రంగులో బోర్డర్ వేసున్న గుంట లాంటిది హనుమంతుడి పాదంట.   ఆ స్ట్రీం లోనే సీతా దేవి స్నానం చేసేదిట. 


Lord Hanuman's Foot Impression



















ముందు నమ్మకపోయినా అక్కడ ఉన్నప్పుడు రామాయణమంతా కళ్ళ ముందే కనిపించింది. అదేమీ విచిత్రమో కానీ అప్పుడు రావణుడు అస్సలు రాక్షసుడులానే కనిపించలేదు.  ఎత్తుకొస్తే వచ్చాడు ఎంత అందమైన ప్లేస్ లో పెట్టాడు అనిపించింది. చుట్టూ కొండలు, వనం, సరస్సులు, పక్షుల కిలకిలారావాలు అసలు కవిత్వమంతా అక్కడే ఉన్నట్లనిపించింది.   నిజం చెప్పాలంటే రావణుడి మీద కొంచెం జాలి కూడా కలిగింది.     ఎత్తుకొచ్చేసాడని నానా గగ్గోలు పెడతాం  కానీ ఇక్కడ ఆడవాళ్ళందరూ కోతుల్లా ఉంటే పాపం అతను మాత్రం ఏం చేస్తాడు అని కూడా అనిపించింది. 



view frm Sita Kovil

      న్యూ ఇయర్ కాబట్టి కొంచెం జనం ఎక్కుగా వున్నా పరిసరాల ప్రభావమో లేక నిజంగా సీత ఉన్న అశోక వనం ఇదే అన్న నమ్మకం కలగటం వల్లో కానీ చాలా ప్రశాంతంగా అనిపించింది.  

    గుళ్ళో రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు వున్నారు.  పూజారిని గుడి గురించి అడిగితే బిజీగా ఉన్నా కూడా విసుక్కోకుండా చక్కగా అడిగిన వాళ్ళందరికీ చెప్పారు.  

     అర్చన చేయించుకుని ఆ స్పెషల్ కుంకాన్ని ఇక్కడి కూడా తీసుకొచ్చి అందరికీ పంచాం. 

నువార ఇలియా దగ్గర  ఉన్న ఇంకో ముఖ్యమైన  ప్రదేశం రావణ ఎల్ల. 


రావణ ఎల్ల ( Ravana Falls )


Ravana Ella


     ఎల్ల అంటే సింహళ  భాషలో వాటర్ ఫాల్స్ అనర్ధం.   ఈ ఫాల్స్ కి వాళ్ళ రాజు రావణుడి అదే మన రావణాసురుడి పేరు పెట్టుకున్నారు.   

       ఈ పేరు రావటానికి ముఖ్య కారణం ఈ వాటర్ ఫాల్స్ పైనున్న కొండమీడున్న గుహ.   దాని పేరు రావణ ఎల్లా  గుహ ( Ravana Ella Cave ).   రావణుడు సీతని ఎత్తుకొచ్చిన తరువాత  అశోక వనంలో ఉంచే ముందు మూడు ప్రదేశాలు మార్చాడుట.   వాటిల్లో ఒకటి ఈ గుహ. 

 గుహ చూడాలంటే రెండు వేల మెట్లు ఎక్కాలి. మెట్లు చాలా క్రుకెడ్ గా ఉన్నాయి. అరగంట పడుతుండట ఎక్కడానికి. ఆడమ్స్ పీక్ దెబ్బతో పిక్కలు పట్టేసి మెట్టు అన్న మాటే ఒక నైట్ మేర్ గా తయారైంది. నాలుగైదు మెట్లు చూసినా అమ్మో ఇన్ని మెట్లే అని గుండె దడ దడా కొట్టుకోవటం మొదలెట్టేది. అసలే సీతని పెట్టిన గుహ. ఈ గుహ కోసం మళ్ళీ శ్రీలంక రాలేము. ఎలా అయినా చూడాలి. ఇద్దరం మొహ మొహాలు చూసుకుని నువ్వు వెళ్ళు అంటే నువ్వెళ్ళు అని కొంచెం సేపు వాదించుకుని ఇద్దరికీ ఓపిక లేక చక్కా వచ్చాం. ఇప్పటికీ అనిపిస్తూ ఉంటుంది ఆడమ్స్ పీక్ ఎక్కక పోతే ఇది చూసే వాళ్ళం కదా అని. ఆడమ్స్ పీక్ ఎక్స్పీరియన్సే వేరు, జీవితంలో మళ్ళీ అలాంటిది రాదు, అయినా నిజంగా ఇక్కడ సీత ఉందని ఎవరు చూసారులే అని సమాధాన పడుతూ ఉంటాను.
 
   నువార ఇలియా నించి రావణ ఎల్లాకి డైరెక్ట్ బస్ లేదు.  మొత్తం మూడు బస్సులు మారాల్సుంటుంది. నువారా ఇలియాలో బస్ తీసుకుంటే వెల్లవాయ ( Wellawaya ) దగ్గర, మళ్ళీ బండారువేల ( Bandarawela )  దగ్గర బస్సులు  మారాలి.  నువార ఇలియా నించి వెల్లవాయ వెళ్ళే దారి లోనే సీతా కోవిల్ వస్తుంది.

       బండారువేల బస్సు రావణ ఎల్లాకి నాలుగడుగుల దూరంలో ఆపాడు.   కాస్త బస్సు  ఎక్కటం దిగటం తప్ప  నడవాల్సిన అవసరం అస్సలు రాలేదు కాబట్టి బానే ఉంది.   తిరిగి వెళ్ళేటప్పుడు మాత్రం రావణ ఎల్లాలో బస్ దొరకలేదు.   ఎంత సేపు నించున్నా అసలు బస్సులే రాలేదు.   ఎల్లా అనే ఊరిదాకా నడిచి అక్కడ బస్సెక్కాం.   మళ్ళీ మూడు బస్సులు మారి రాత్రి ఎనిమిదిన్నరకి నువార ఇలియా చేరుకున్నాం. 

మేము వెళ్ళినప్పుడు తెలీదు కానీ ఇప్పుడు శ్రీలంక టూరిజం రామాయణ టూర్లు ఆఫర్ చేస్తోంది. రావణుడు శివుడ్ని ప్రసన్నం చేసుకోవటానికి పేగులు తీసి వీణ వాయిన్చాడని చెప్తారు కదా. అది exaggeration అనుకున్నా
అతను మంచి సంగీత విద్వాన్సుడుట.  అతను కనిపెట్టిన ఆ వీణ లాంటి దాని పేరు రావణ హట్ట.   శ్రీలంకలో దాని గురించి అందరూ మర్చపోయారు కాబట్టి దాన్ని మళ్ళీ  లైం లైట్ లోకి  తీసుకురావాలని ఒకతను ట్రై చేస్తున్నాడని ఈ మధ్యే ఏదో ఆర్టికిల్లో చదివా.    రాజస్థాన్ ఎడారిలో వైలిన్ లాంటి ఫోక్ వాయిద్యం వాయిస్తున్న వాళ్ళని టీవీల్లో చూస్తాం కదా.  రావణ హట్ట కూడా అలానే ఉంటుందిట. 

తమిళనాడుకి జాఫ్న దగ్గర కాబట్టి అనూరధపుర చుట్ట పక్కల ప్రాంతాలలో అరవ వాళ్ళు ఎక్కువ ఉంటారనుకున్నాం కానీ చాలా తక్కువగా కనిపించారు.   వాళ్ళు కూడా శ్రీలంక తమిళ్ తప్ప ఇక్కడి తమిళ్ మాట్లాడలేకపోయారు. 

   సౌత్ కొస్తున కొద్దీ తమిళియన్లు చాలా మంది కనిపించారు. నువార ఇలియాలో అయితే ఇంక చెప్పఖరలేదు. వీళ్ళ భాష దాదాపు ఇక్కడి తమిళ్ లానే ఉంది.   భాష సంగతేమో కానీ ముందు లుంగీలలో, స్కిర్ట్లలో అమ్మాయిలని చూసీ చూసీ విసిగిపోయి ఉన్నామేమో ఇక్కడ చీరల్లో కనిపించేసరికి హాయిగా అనిపించింది.   కాకపోతే వాళ్ళు సింహళ పద్ధతిలో కట్టుకున్నారు. 

       శ్రీలంక బయల్దేరే ముందే మా అక్క అక్కడ మాస్కులు చాలా పొపులర్ తెచ్చుకోండి నాకు కూడా ఒకటి తీసుకురండని చెప్పింది.   ఎటూ నాకు సువనీర్లు కలక్ట్ చేయటం హాబీ కాబట్టి శ్రీలంక ఎయిర్ పోర్టు లో అడుగు పెట్టినప్పటి నించీ మాస్కుల వేటలో పడ్డా.    అనూరధపురకి అంత సీన్ లేదు. అదసలే పల్లెటూరు లాంటిది. కాండీలో మేమున్న హోటల్ సువనీర్ షాపులో అయితే పట్టుమని పది మాస్కులు లేవు, వేలల్లో చెప్పాడు. చెక్కతో చేసి రంగులు పూసిన వస్తువు ఇలా వేలల్లో ఉంటుందని తెలిసేసరికి హార్ట్ అటాక్ వచ్చినంత పనైంది. కాండీ లోనే ఇలా ఉంటే ఇంక నువార ఇలియా అసలే హిల్ స్టేషన్. అక్కడ లక్షల్లో ఉంటుందేమో ఇక్కడే కొనేద్దామా అని చాలా ఆలోచించాము కానీ కొనటానికి చేతులు రాలేదు.

   నువారా ఇలియాలో మొదటి రోజు బిజీ గా గడిచిపోయింది. ఇంక అక్కడ మాకుంది ఒక పూట. టెన్షన్ మొదలైపోయింది. దాదాపు పది షాపుల దాకా తిరిగాం. ఆ మాస్కులు షాపులకి దిష్టి బొమ్మల్లాగా తగిలించారు. అవి కొనాలనుకుంటున్నాం ఎక్కడ దొరుకుతాయని అడిగాం.   చాలా షాపులు అరవ వాళ్ళవే కాబట్టి భాషకి ప్రాబ్లం రాలేదు. మేము కూడా అరవ వాళ్ళమని అనుకున్నట్లున్నారు. ఒక షాపులో అయితే వాళ్ళు వెళ్లాడ తీసుకున్న దిష్టి మాస్కుని  తీసి దుమ్ము దులిపి మాకు ఫ్రీ గా ఇచ్చేయటానికి సిద్ధపడ్డారు.   అవి మూడు నాలుగు వందల కంటే ఎక్కువ వుండవుట.   చివరికి ఎక్కడ దొరుకుతాయో తెలిసింది.  ఒకతను  ఒద్దన్నా వినిపించుకోకుండా  మమ్మల్ని షాపుకి తీసుకెళ్ళి రేటు ఎంత పెట్టాలో ఒకటికి పది సార్లు చెప్పాడు.  అలా  హోటల్ గ్రాండిస్ సువనీర్ షాపులో ఆరు వందల శ్రీలంక రూపాయిలతో పెద్ద మాస్కులు కొన్నాం.

మనసు శాంతిన్చాక ఇంక ఆత్మా రాముడ్ని కూడా శాంత పరచడానికి అమ్బల్స్ వెళ్ళి బఫే తిన్నాం.  హోటల్ కెళ్ళి సామాను తీసుకుని ఆటోలో కందపోల అనే ఊరు బయల్దేరాం. రెండు వైపులా టీ గార్డన్లు. టాక్సీ కంటే ఆటో అయితే బాగా ఎంజాయ్ చెయ్యచ్చు. కందపోల ప్రత్యేకత అక్కడున్న హోటల్ " ది టీ ఫ్యాక్టరీ". ఫ్రెండ్ ముందే చెప్పింది టీ ఫ్యాక్టరీ లో ఎక్స్పీరియన్స్ చాల బావుంటుంది మిస్ అవద్దు అని. చాలా ఖరీదైన హోటల్ కాబట్టి ఒక రోజుకి బుక్ చేసుకున్నాం.

Saturday 12 November 2011

Sri Lanka - Kandy


   పొద్దున్న రెస్ట్ హౌస్ లో చెకౌట్ చేసేసి పదకొండున్నరకి ఎసి మినీ బస్ తీసుకుని కాండి బయల్దేరాం.   కాండి చేరేటప్పటికి మూడైంది.  హోటల్  Suisse లో బుక్ చేసుకున్నాం.    

     కాండి చూడటంతో పాటు దానికి దగ్గరలో ఉన్న శ్రీపాద అనే కొండ కూడా ఎక్కటానికి ప్లాన్ చేసుకున్నాం.  అక్కడ నించి సన్ రైజ్ చూడాలి. సన్రైస్ జరిగేటప్పుడు  కొండ నీడ గాల్లో ట్రైఆంగిల్ ఆకారంలో నిట్ట నిలువుగా పడుతుంది. ఆ వింత చూడటానికే ముఖ్యంగా పర్యాటకులు వస్తారు.  రోజు గడిచే కొద్దీ ఆ నీడ స్లాన్టింగ్ గా మారిపోతుంది.   

   సాధారణంగా రాత్రి తొమ్మిది  పది ప్రాంతాలకి కొండ ఎక్కడం మొదలు పెడతారు . ఎక్కడానికి నాలుగు గంటలు పడుతుంది. రాత్రి కొండ మీదే ఉండి సూర్యోదయం చూసి కొండ దిగుతారు.

  హోటల్ కి వెళ్ళగానే ముందు శ్రీ పాద టూర్ గురించి కనుక్కున్నాం. అసలే మబ్బుగా ఉంది వానొస్తే కొండెక్కటం కష్టమైపోతుంది పైగా మబ్బుగా ఉంటే ఏమీ కనిపించదు పగలైతేనే  మంచిది ఎండుంటుంది కాబట్టి కొండ పైనించి వ్యూ చూడచ్చు అని చెప్పాడు.   అందులో క్రిస్మస్  న్యు ఇయర్ పీక్ టూరిస్ట్ సీజన్ కాబట్టి టూరిస్ట్లు  వేలల్లో  ఉంటారు.  పైన ఉండటానికి ఒకటో రెండో గదులు తప్ప ఇంక ఫెసిలిటీస్  ఏమీ లేవు. చలిలో వణుక్కుంటూ ఆరు బయటే నిన్చోవాల్సి రావచ్చు  అని చిన్న వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఇంక చేసేదేమీ లేక పొద్దున్న బయల్దేరటానికి వాన్ మాట్లాడుకున్నాం.
          
    అతను చెప్పినట్టే ఎనిమిదింటికి వాన మొదలైంది.    కాండి చుట్టూ కొండలే కాబట్టి రాత్రి విపరీతంగా చలుంది.   ఇండియన్ రెస్టారంట్ లో తినాలనుకునే వాళ్ళకి  Devon's Captain's Table అనే మంచి రెస్టారంట్ ఉంది.
 

శ్రీ పాద/ Adam's Peak
 

Sri Pada/ Adam's Peak

   
దీని ఎత్తు ఏడు వేల అడుగులు.    దీన్నే ఆడమ్స్ పీక్ అని కూడా అంటారు.   కొండ పైన బుద్ధుడి పాద ముద్ర ఉంటుందిట.   బుద్ధుడు మూడో సారి శ్రీలంక వచ్చినప్పుడు ఈ కొండ మీద పాదం మోపాడని ఆ పాద  ముద్రే అక్కడ పడిందని బౌద్ధ మతస్తుల నమ్మకం.   క్రైస్తవం వచ్చిన తరవాత దాని పేరు ఆడమ్స్ పీక్  అయింది.    ఆ పాదం ఆడందే అని వాళ్ళ పేరు వాళ్ళు పెట్టేస్కున్నారు.

   డిసెంబర్లో పౌర్ణమి నించి మొదలు పెట్టి మేలో పౌర్ణమి వరకు భక్తులు ఈ కొండెక్కుతారు.   తరవాత  అంతా వర్షా కాలం. 

     డల్హౌసీ అనే ఊరు నించి మెట్ల దారి మొదలవుతుంది. మెట్లు ఆరు వేల పైనే. పొద్దున్నే ఆరింటికి హోటల్ నించి వాన్ లో బయల్దేరాం.  డల్హౌసీ చేరేటప్పటికి  తొమ్మిదిన్నరైంది. పార్కింగ్ లాట్ నించి మెట్ల దారి దాక నడుచుకుంటూ వెళ్ళాం.   దారికి రెండు వైపులా కొట్లే.   తిండి, సాఫ్ట్ డ్రింక్స్ , స్వెట్టర్లు, టోపీలు, మఫ్లర్లు, గొడుగులు, బొమ్మలు ఒకటేమిటి ఏది తెచ్చుకోవటం మర్చిపోతే అది దొరుకుతున్దక్కడ.


Reclining Buddha at the starting point

  మెట్ల దారి మొదలయ్యే చోట హాయిగా చీకూ చింతా లేకుండా నిద్ర పోతున్న బుద్ధుడు. 

         అందరూ దాదాపు రాత్రే వెళిపోతారు కాబట్టి అందరూ మెట్లు దిగేవాళ్ళే. మేమిద్దరమే ఎక్కేవాళ్ళం. కొంచెం దూరం ఎక్కాక  మాకు డౌటొచ్చింది అసలు పొద్దున్న పైకి వెళ్ళనిస్తారా అని. ఒక పది మంది అబ్బాయిలు కూడా ఎక్కటం మొదలు పెట్టేసరికి అమ్మయ్య అనుకున్నాం. మెట్లు రకరకాల సైజులు షేపుల్లో ఉన్నాయి. కొన్ని చోట్లయితే మెట్లు పూర్తిగా విగిరిపోయాయి. ఎటువంటి రిపేర్లు చెయ్యలేదు. కొన్ని చోట్ల అసలు మెట్లు లేనే లేవు ఇక్కడ ఒకప్పుడు మెట్లు ఉండేవి అని గుర్తులు తప్ప. మెట్ల పక్కన కట్టిన జారుడుబండ లాంటి గట్టు మీంచి చక్కగా జారుకుంటూ  ఎక్కాల్సొచ్చింది.  దీనికి తోడు కొన్ని చోట్ల మెట్ల నిండా నీళ్ళు.  

       రైయ్యిమని కార్ లో వెళ్ళటం తప్ప  తిరుపతి కొండ కూడా కాలి నడకన  ఎప్పుడూ ఎక్కిన పాపాన పోలేదు.   అలాంటిది ఒకేసారి ఆరు వేల మెట్లంటే  అమ్మో ఇంకేమైనా ఉందా ఎంత గుండె  ధైర్యం కావాలి.   ఆ ధైర్యం ఎవరైనా ఇస్తారేమోనని ఎదురొచ్చిన వాళ్ళని ఆపి అడిగాం.   బాబోయి మోకాళ్ళు కొట్టుకుపోయాయని ఒకళ్ళు,  ఇంత కష్టమైన మెట్లు జీవితంలో ఎక్కలేదని  ఇంకొకళ్ళు,   సింగపూర్ నించి వచ్చిన ఆడవాళ్ళ బాచ్  అయితే ఆరింటికి  దిగటం మొదలు పెట్టాం ఇప్పటికి సగం మెట్లు దిగగలిగాం ఎక్కటానికి మాకు ఏడు గంటలు  పట్టిందని ధైర్యాన్ని కాస్తా నీరు కార్చేసారు.    మెట్లు ఎప్పుడూ తిన్నగా ఎక్కకూడదు డయాగనల్ పటార్న్ లో ఎక్కితే మోకాళ్ళ మీద అంత ఎఫెక్ట్ ఉండదని  సలహా కూడా ఇచ్చారు.    మాకు ఏడు గంటల పాటు తీరిగ్గా ఎక్కటానికి టైం లేదు.   వాళ్ళల్లాగా నెమ్మదిగా ఎక్కితే ఎలా ఉండేదో  ఎండ రాకుండా కొండపైకి వెళిపోవాలని   ఒక ఊపులో  ఎక్కేసరికి మనకున్న  బలానికి   సగం పైన మెట్లు ఎక్కేసరికి కాళ్ళు పని చెయ్యటం మానేశాయి.  




   దారి పొడుగునా షాపులున్నాయి. కింద నించి తిండేమీ మోసుకుంటూ వెళ్ళఖర్లేదు. చివరి మెట్లు మాత్రం చాలా స్టీప్ గా ఉంటాయి. అవి అయిదు వందల నించి వెయ్యి దాకా ఉండచ్చు. గ్రావిటేషనల్ పుల్ వెనక్కి లాగేస్తూ ఉంటుంది. లక్కీ గా ఆ మెట్లకి మాత్రం రైలింగ్ ఉంది. ఆ స్టేజికి వచ్చేసరికి కాళ్ళు ఎటూ చచ్చు పడిపోతాయి కాబట్టి చేతులు విల్ పవర్ రైలింగ్ సహాయంతోనే ఎక్కాలి.   


ఈ మెట్ల దారి నించి మాత్రం మంచి వ్యూస్  ఉన్నాయి. 





 
   మొత్తానికి రెండు మూడు లీటర్ల కూల్ డ్రింకులు, చాలా సీసాల మంచి నీళ్ళు, అయిదారు టీలతో ఒకటింపావు కల్లా పైకి చేరుకున్నాం. పైకి చేరుకోగలిగామన్న ఆనందం ఒకటైతే కనిపించిన వాళ్ళందరూ మబ్బుల వల్ల సూర్యోదయం చూడలేకపోయామని చెప్పటం చెప్పలేనంత పైశాచికానందాన్ని కలిగించింది.

        పైన చిన్న గుడుంది.   పాదాలు ఉన్నాయన్న చోట  గుడ్డ కప్పేసారు కాబట్టి పాదాలు చూడటానికి లేదు.  దాని కింద ఎనిమిదడుగుల లోపల బుద్ధుడి పాద ముద్ర ఉందిట.   గంట కూడా ఉంది.  కొండ ఎన్ని సార్లు ఎక్కారో గంట అన్ని సార్లు కొట్టాలిట.  

      కాస్త బిస్కెట్లు తిని రెస్ట్ తీసుకుని రెండుమ్పావుకి కొండ దిగటం మొదలుపెట్టాం.   మెట్లెక్కడమే పెద్ద ప్రాజెక్ట్ అనుకుంటే దిగటం దాని తాతలా ఉంది.   కాళ్ళు చచ్చు పడిపోయాయి కాబట్టి ఇంకవి మా కంట్రోల్లో లేవు.   అడుగులు  మెట్లు విరిగిపోయిన చోట కరక్ట్ గా ఆ విరుగులోనో లేకపోతే జర్రుమని జారే చోటో లేకపోతే  గోతిలోనో వాటిష్ట మొచ్చినట్లు  పడ్డాయి. 

     ఏ   తొమ్మిదిన్టికో ఎక్కటం మొదలు పెడతారనుకుంటే లోకల్స్ చాలా మంది మధ్యాహ్నం రెండింటికే  ఎక్కటం మొదలు పెట్టారు.  పదేళ్ళ పిల్లల్నించి ఎనభై ఏళ్ల ముసలి వాళ్ళ వరకు నెత్తి మీద వంట సామాను, దిళ్ళు దుప్పట్లు పెట్టుకుని  ఎక్కేస్తున్నారు.   అంటే ఏ ఎనిమిది గంటల సేపో ఎక్కి పైనే వంట చేసుకుని ఓ కునుకు తీస్తారనుకుంట. 



దారి పొడుగునా ట్యూబ్ లైట్లు ఉన్నాయి.   కొంచెం చీకటి పడుతున్నప్పుడే లైట్లన్నీ వేసేస్తారు.   మెట్లన్నీ దిగేసరికి రాత్రి ఏడైంది.   అప్పటికే కొండెక్కే  వాళ్ళు వందల్లో మాకు ఎదురొచ్చారు.    కొండ దిగేసాక సిద్ధలేప సీసా కొనుకున్నాం.  మన జండూ బామ్  లాంటిది.  అక్కడ హాట్ కేకుల్లా  అమ్ముడు పోతోంది.  తెలివైన వాళ్ళు ఎక్కేటప్పుడే   కొనుక్కుంటున్నారు.   ఎలా అయితేనే వాన్ దాకా కాళ్ళీడ్చుకుంటూ రాగలిగాం.  

           నీ పాడ్స్ తప్పనిసరిగా వేసుకోవాలి.  మోకాళ్ళకి సపోర్ట్ ఉంటుంది.    ఒక విషయమైతే అర్థమైంది.  తెల్ల వాళ్ళకి  పిక్క బలాలు ఎక్కువ కాబట్టి వాళ్ళు అరవై ఏళ్ళకి కూడా బానే ఎక్కగలుగుతారు.  వాళ్ళని చూసి మనం వాత పెట్టుకుంటే ఏ గుడిసో  వేసుకుని పర్మనెంట్ గా కొండ పైనే సెట్టయిపోవాల్సోస్తుంది.  

    

కొండ మీద కనిపించే తెల్ల గీత లాంటిది మెట్ల దారి.   పైన  కనిపించే ఇల్లు లాంటిది గుడి.     

     పదిన్నరకి హోటల్ చేరుకున్నాం. కదిలే ఓపిక లేదు. రూం కే సాండ్విచెస్ తెప్పించుకుని సిద్ధలేప సీసా మొత్తం పట్టించి చెరో రెండు పెయిన్  కిల్లర్లు మింగి ఓ యుగం పాటు రెస్ట్ తీసుకోటానికి రెడీ అయ్యాం.   కొండ దెబ్బతో మోకాళ్ళు పిక్కలు పట్టేసి మామూలు స్థితికి రావటానికి పది రోజులు పట్టింది.   

    ఇంతా ప్లాన్ చేసుకుని  కాళ్ళ నెప్పులని రూంలో తొంగుంటే కుదరదు  కదా.   ఆ రోజే నువార ఇలియా అనే ఊరు  కూడా వెళ్ళాలి.  పొద్దున్న టిఫిన్ తినేసి కాండీ  ఊరు చూడటానికి బయల్దేరాం.   కాండీలో ముఖ్యంగా చూడాల్సింది Tooth Relic Temple. 


దలద మలిగవ ( Dalada Maligawa )

Tooth Relic Temple, Kandy

   దలిద మలిగవ అనేది శిన్హళా భాషలో ఆ గుడి పేరు.  ఈ గుడి బుద్ధుడి పన్ను పెట్టడానికి కట్టారు.  బుద్ధుడు పోయిన తరవాత అతని చితిలో  పన్ను మాత్రం కాలకుండా ఉండిపోయిందిట.    ఆ పన్ను తీసి భద్రపరిచారు.  ఆ పన్ను ఏ రాజు దగ్గరుంటే ఆ రాజుకి అదృష్టం పడుతుందని నమ్మే వాళ్లుట.   ఆ  పన్ను కోసం యుద్ధాలు కూడా జరిగాయిట.  అది రకరకాల రాజుల చేతులు మారిందిట.   ఇండియాలో బౌద్ధ మతానికి కష్ట కాలం వచ్చేసరికి ఒరిస్సా రాణి తన జుట్టులో పన్ను దాచి  శ్రీలంకకి స్మగుల్  చేసిందిట.   అక్కడ కూడా అది చాలా ఊళ్ళు మారి ఫైనల్ గా కాండీలో సెటిల్ అయ్యింది. 

         మేము వెళ్ళిన రోజు పౌర్ణమి.    లోపలకి వెళ్ళాలనిపించలేదు.  కొండవీటి చాంతాడంత  క్యూ ఉంది.  రెండు మూడు గంటలు లైన్ లో నించుని లోపలి కెళితే  చివరికి ఏ గుడ్డో కప్పి దాని కింద పన్నుంది అంటారేమో అనిపించింది. 

      కాండీ  చాలా అందమైన ఊరు.   చుట్టూ కొండలు ఊరి మధ్యలో సరస్సు  చాలా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది.







ఊరు ఎంజాయ్ చేసేసి హోటల్కెళ్ళి లగేజ్ తీసుకుని నువార ఇలియ బయల్దేరాం. కాండీ నించి నువార ఇలియాకి డైరెక్ట్ ట్రైన్ లేదు. ముందు కాండీ నించి పెరడీనియా ( Peradeniya ) వెళ్ళాలి. పొద్దున్న 9.50 కి రైలు. పది నిమిషాలే ప్రయాణం. అక్కడ నించి నాను ఓయ ( Nanu Oya ) అనే ఊరికి 10.45 కి వేరే రైలు తీసుకోవాలి.     నాను ఓయ చేరటానికి మూడు గంటలు పడుతుంది. నువార ఇలియాకి రైల్వే స్టేషన్ నించి వాన్ లు ఉంటాయి.
   
      రైళ్ళ గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాలి.   ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ కి ఏసి తప్ప తేడా ఏమీ లేదు.   ఒకే రకమైన సీట్లు.   సీట్ల రంగులోనే మురికి కూపాల్లాంటి కర్టెన్లు.   కొలంబో నించి అనూరధపురకి ఫస్ట్ క్లాస్ లో వెళ్ళి విరక్తి తెచ్చుకున్నాం.   అందుకని ఈ సారి సెకండ్ క్లాస్ లో వెళ్లాలని నిర్ణయించుకున్నాం.   ఇంక థర్డ్ క్లాస్ అయితే ఉట్టి చెక్క బెంచీలే. 

 





రైళ్ళు బ్రిటిష్ వాళ్ళ కాలం నాటివే.  ఇంక రైలు పట్టాల మీద వెళ్ళదు.  గాలిలో ఊగుకుంటూ వెళుతుంది.   మొదటి అరగంటా చాలా భయమేసింది.  డెఫినెట్ గా పట్టాలు తప్పుతున్దనుకున్నాం.   కుదుపులు అలవాటు అయిపోయాక   టీ ప్లాన్టేషన్స్, వాటర్ ఫాల్స్  కొండలు లోయలు చూస్తుంటే అసలు టైమే తెలీలేదు.  అచ్చు స్విట్జెర్లాండ్ లో ఉన్నట్టుంది. 


















నువార ఇలియాలో ఉన్న హోటల్ పేరు Windsor. అప్పటి కలోనియల్ పెరియడ్ కి గుర్తుగా కట్టడాలు, పేర్లు అలానే ఉంచేసారు. సాయింత్రం ఇంటర్నెట్ సెంటర్ లో , మార్కెట్ తిరుగుతూ గడిపేసాం. శాకాహారులకి అమ్బల్స్ (Ambals) అనే ఫుడ్ ప్లేస్ బావుంటుంది. అక్కడ దోశ కొబ్బరి పచ్చడితో భోజనం చేసాం.  అక్కడ ఉన్న రెండు రోజులు అమ్బల్స్ లోనే తిన్నాం.   ఇండియా నించి ఎవరినా వస్తుంటే మా హోటల్ గురించి చెప్పండని విజిటింగ్ కార్డు కూడా ఇచ్చారు.